/rtv/media/media_files/2025/01/25/pUHNMbHkdWtqtHSomdCb.jpg)
CM Chandra babu Naidu
ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కాట్రగడ్డ వెంకట్రామిరెడ్డిపై ప్రభుత్వం వేటు వేసింది. గత రెండేళ్లుగా సస్పెన్షన్లో ఉన్న ఆయనపై వచ్చిన ఆరోపణలు విచారణలో నిజమని తేలడంతో, ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఆయనకు ఇంకా 14 ఏళ్ల సుదీర్ఘ సర్వీస్ మిగిలి ఉండగానే ఉద్యోగం కోల్పోవడం ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
తొలగింపునకు ప్రధాన కారణాలు ఇవే..
వెంకట్రామిరెడ్డిపై ప్రధానంగా ఎన్నికల నిబంధనల ఉల్లంఘన, అధికార దుర్వినియోగం ఆరోపణలు ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి కూడా YCP తరఫున ప్రచారం చేశారనేది ప్రధాన అభియోగం. ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగులను వైసీపీకి ఓటు వేయాలని ప్రోత్సహించినట్లు ఆధారాలతో సహా నిరూపితమైంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో గతంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఆయన్ని సస్పెండ్ చేయాలని ఆదేశించింది. అనుమతి లేకుండా ఉద్యోగులకు మద్యం విందు ఏర్పాటు చేసిన వ్యవహారంలో అబ్కారి శాఖ ఆయనపై కేసు నమోదు చేసింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ అంశాలపై ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరిపింది. ఈ విచారణలో ఆయన చేసిన తప్పులు నిర్ధారణ కావడంతో, ప్రభుత్వం ఆయన్ని సర్వీస్ నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంపై కాట్రగడ్డ వెంకట్రామిరెడ్డి తీవ్రంగా స్పందించారు. తనను ఉద్యోగం నుండి తొలగించడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు.
"నేను ఉద్యోగ సంఘం నేతగా బాధ్యతాయుతంగా వ్యవహరించాను. ఉద్యోగులకు దిశానిర్దేశం చేయడం తప్ప ఏ రాజకీయ పార్టీకి కొమ్ముకాయలేదు. నాపై వచ్చిన ఆరోపణలకు సరైన ఆధారాలు లేవు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని నా 14 ఏళ్ల సర్వీసును దెబ్బతీశారు. ఈ అన్యాయంపై నేను కోర్టును ఆశ్రయిస్తాను," అని ఆయన వెల్లడించారు. వైసీపీ హయాంలో అత్యంత శక్తివంతమైన నేతగా వెలిగిన వెంకట్రామిరెడ్డి, ప్రభుత్వం మారిన తర్వాత తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. ఇప్పుడు ఏకంగా ఉద్యోగమే పోవడంతో ఆయన రాజకీయ భవిష్యత్, న్యాయ పోరాటం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయాలకు దూరంగా ఉండాలనే దానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలుస్తోంది.
Follow Us