Vijayashanti: రెండోసారి బీజేపీకి గుడ్ బై చెప్పిన రాములమ్మ.. ఈసారి పార్టీని వీడటానికి ఆయనే కారణమా?!

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు విజయశాంతి. ఏ పార్టీతో అయితే రాజకీయ ప్రస్థానం ప్రారంభించారో.. అదే పార్టీకి రెండుసార్లు రాజీనామా చేశారు విజయశాంతి. అంతేకాదు.. రెండోసారి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

New Update
Vijayashanti: రెండోసారి బీజేపీకి గుడ్ బై చెప్పిన రాములమ్మ.. ఈసారి పార్టీని వీడటానికి ఆయనే కారణమా?!

Telangana Elections 2023: విజయ శాంతి.. సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ ఫైర్ బ్రాండ్. సినిమాల్లో లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటించి లేడీ సూపర్ స్టార్‌గా, దక్షిణాది అమితాబ్ బచన్‌గా గుర్తింపు పొందిన విజయశాంతి.. రాజకీయాల్లో తన వాగ్ధాటితో, ఘాటైన విమర్శలతో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందారు. అయితే, సినిమాల్లో రాణించినంతగా.. రాజకీయాల్లో మాత్రం ఆమె రాణించలేకపోయారనే మాత్రం నిజం. ఆమె నిలకడలేని నిర్ణయాలే ఇందుకు కారణం అని విశ్లేషిస్తారు రాజకీయ నిపుణులు. తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ సంచలనంగా నిలిచే విజయశాంతి.. ఇప్పుడు మరోసారి వార్తల్లో హెడ్‌లైన్‌లో నిలిచారు. ఇందుకు కారణం.. ఆమె మరోసారి పార్టీ మారడమే. విజయశాంతి మరోసారి బీజేపీని వీడి.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. అందుకే ఆమె టాప్ న్యూస్‌లో నిలిచారు. ఎన్నికల వేళ రాజకీయ నేతలు పార్టీలు మారడం సహజమే. కానీ, విజయశాంతి పార్టీ మారడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే.. ఏ పార్టీతో అయితే తన రాజకీయ జీవితం ప్రారంభించారో అదే పార్టీకి రెండోసారి రాజీనామా చేసి.. కాంగ్రెస్ పార్టీలో రెండోసారి జాయిన్ అయ్యారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 30 పోలింగ్ జరుగనుంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. నామినేషన్ల ఉపసంహరణ కూడా పూర్తయ్యింది. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరో కూడా తేలిపోయింది. ప్రధాన పార్టీల నేతలు, అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఇదిలాఉంటే.. మరోవైపు నేతల జంపింగ్స్ కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి.. ఈ పార్టీ నుంచి మరో పార్టీలోకి ఇలా ఛేంజ్ అవుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా బీజేపీలో తీవ్ర అసంతృప్తితో ఉన్న విజయశాంతి.. నవంబర్ 15న ఆ పార్టీకి రాజీనామా చేసి.. ఇవాళ అంటే నవంబర్ 17న హైదరాబాద్‌లో ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఆయన తీరుపై అసంతృప్తితో బీజేపీకి రాజీనామా..?

ఇదిలాఉంటే.. తెలంగాణ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కారణంగానే విజయశాంతి బీజేపీని వీడారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. విజయశాంతికి, ఈటల రాజేందర్‌కు మధ్య వైరం పెరిగిందట. తనకంటే వెనుక పార్టీలోకి వచ్చిన ఈటల రాజేందర్‌కు ప్రాధాన్యత ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట విజయశాంతి. ఇక పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టిన తరువాత ఈటల తీరులో మార్పు వచ్చిందని ఆమె ఆగ్రహంగా ఉన్నారట. ఈటల రాజేందర్ తనను పట్టించుకోలేదని విజయశాంతి తీవ్ర అంసత‌ృప్తితో రగిపోయారని సమాచారం. ఈ క్రమంలోనే ఆ మధ్య ఈటల రాజేందర్‌పై ట్విట్టర్‌లోనూ ఆమె పరోక్ష విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. చిట్ చాట్‌ల పేరుతో లీక్‌లు ఇస్తున్నారని ఈటలపై విమర్శలు గుప్పించారు. బండి సంజయ్‌పై ఈటల రాజేందర్ ఫిర్యాదు వ్యవహారం తర్వాత మరింత దూరం జరిగారు విజయశాంతి. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా ఆమె పార్టీని వీడుతారని ప్రచారం జరిగింది. ఆ ప్రచారం కాస్తా ఇప్పుడు నిజమైపోయింది. బీజేపీకి రెండోసారి రాజీనామా చేసిన విజయశాంతి.. కాంగ్రెస్‌లో రెండోసారి చేరారు.

విజయశాంతి రాజకీయ ప్రస్థానం..

1995 తరువాత ఆమె రాజకీయాల వైపు ఇంట్రస్ట్ చూపుతు వచ్చిన విజయశాంతి.. 1998లో రాజకీయ ప్రవేశం చేశారు. భారతీయ జనతా పార్టీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తరువాత 2001లో కేసీఆర్.. టీఆర్ఎస్ పార్టీ పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయగా.. ఆమె తెలంగాణపై ఫోకస్ పెంచారు. ఈ క్రమంలోనే.. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2005లో తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ తరువాత 2009లో తన పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేసి టీఆర్ఎస్‌లో(నేటి బీఆర్ఎస్) చేరారు. 2009లో మెదక్ పార్లమెంట్ స్థానం నుండి బీఆర్ఎస్(టీఆర్ఎస్) అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఇదే ఆమె మొదటి గెలుపు. అయితే, 2013లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ విజయశాంతిని బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు కేసీఆర్. దాంతో ఆమె 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేసి.. 07 డిసెంబర్ 2020న బీజేపీలో చేరారు. ఇప్పుడు మళ్లీ 2023 నవంబర్ 15న బీజేపీకి పార్టీకి రాజీనామా చేస్తూ ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డికి రాజీనామా లేఖను పంపారు. నవంబర్ 17న అంటే శుక్రవారం నాడు హైదరాబాద్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు విజయశాంతి.

Also Read:

ప్రైవేటు ఉద్యోగాల్లో రిజర్వేషన్ చెల్లదు.. హర్యానా హైకోర్టు సంచనల తీర్పు..

Advertisment
Advertisment
తాజా కథనాలు