Karimnagar: కరీంనగర్‌లో థ్రిల్లింగ్ ఫైట్.. పోటీ చేసే ముగ్గురూ మున్నూరు కాపులే.. ?

కరీంనగర్ నియోజకవర్గంలో ఈసారి థ్రిలింగ్‌ కాంపిటేషన్ ఉండనుంది. ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న గంగుల కమలాకర్, బండి సంజయ్, పురుమల్ల శ్రీనివాస్ ముగ్గురూ మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన వారే. దాంతో టఫ్ కాంపిటీషన్ కనిపిస్తోంది.

New Update
Karimnagar: కరీంనగర్‌లో థ్రిల్లింగ్ ఫైట్.. పోటీ చేసే ముగ్గురూ మున్నూరు కాపులే.. ?

Karimnagar Constituency: తెలంగాణలో(Telangana) హైదరాబాద్, వరంగల్ తరువాత అంత ప్రాముఖ్యత ఉన్న జిల్లా కరీంనగర్(Karimnagar). ఉద్యమాల పురిటిగడ్డ. ఒకప్పటి సబ్బినాడు.. నేడు కరీంనగర్‌గా పిలువబడుతోంది. చారిత్రకంగా ఈ జిల్లాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శాతవాహనులు, కాకతీయులు, మౌర్యులు, అసఫ్ జాహీలు సహా ఎంతో మంది రాజ వంశాల ఏలుబడిలో కీలక ప్రాంతంగా నిలిచింది కరీంనగర్. ఈ జిల్లాకు రాజకీయ చారిత్రక ప్రాముఖ్యత చాలా ఉంది. నాడే కాదు.. నేడు కూడా ఈ జిల్లా రాజకీయంగా చాలా కీలకం. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసింది కరీంనగర్.. ఎందరో ఉద్యమకారులను, కళాకారులను అందించింది కరీనంగర్.. నాటి నుంచి నేటి వరకు కూడా కరీంనగర్ ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. ప్రస్తుతం తెలంగాణ మూడవ శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ జిల్లా నుంచి.. ముఖ్యంగా కరీంనగర్ నియోజకవర్గం నుంచి కీలక నేతలు బరిలో నిలుస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి గంగుల కమలాకర్, బీజేపీ నుంచి బండి సంజయ్ కుమార్, కాంగ్రెస్ నుంచి పురుమల్ల శ్రీనివాస్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. మరి ఈ ముగ్గురు నేతల ప్రొఫైల్ ఏంటో ఓసారి చూద్దాం..

గంగుల కమలాకర్..

కరీంనగర్ భీముడిగా నియోజవర్గ ప్రజలకు సుపరిచితమైన గంగుల కమలాకర్ 2000 సంవత్సరం నుంచి క్రియాశీలక రాజకీయాల్లో రాణిస్తున్నారు. 2000 - 2005 మధ్య కాలంలో కరీంనగర్‌ మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా, కరీంనగర్ మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు. 2006 - 2007 లో కరీంనగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2009లో అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్‌ శాసనసభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. ఉద్యమ సమయంలో టిడిపికి రాజీనామా చేసి 2013లో టీఆర్‌ఎస్‌లో చేరారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ పై పోటీచేసి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ పై గెలుపొందారు. 2018 ముందస్తు ఎన్నికల్లో కూడా బండి సంజయ్ కుమార్ పై గెలిచారు. 2019 సెప్టెంబరు 8న కేసీఆర్ రెండవ మంత్రివర్గంలో మంత్రిగా చేరారు. ఆయనకు బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖలను కేటాయించారు. ఇప్పుడు నాలుగోసారి ఎన్నికల బరిలో నిలుస్తున్న గంగుల కమలాకర్.. కాస్త టఫ్‌ని ఎదుర్కొంటున్నారు. అయితే, కరీంనగర్‌లో తాను చేసిన అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాలు తనను మరోసారి గెలిపిస్తాయని గట్టి విశ్వాసంతో ఉన్నారు మంత్రి గంగుల కమలాకర్.

బండి సంజయ్ కుమార్..

బండి సంజయ్ ABVPలో కరీంనగర్ పట్టణ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా బాధ్యతలు నిర్వహించారు. 1994-2003 కాలంలో ది కరీంనగర్ కో-ఓపరేటివ్ అర్బన్ బ్యాంక్‌లో రెండు సార్లు డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. కరీంనగర్ పట్టణ యువమోర్చా ప్రధాన కార్యదర్శి, పట్టణ అధ్యక్షునిగా, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబెర్‌గా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్‌గా, జాతీయ కార్యదర్శిగా వివిధ హోదాల్లో పార్టీలో పని చేశారు. అనంతరం బీజేపీ కేరళ, తమిళనాడు ఇంచార్జి‌గా బాధ్యతలు నిర్వహించారు. 2005 లో కరీంనగర్‌లో బీజేపీ కార్పొరేటర్ గా మూడుసార్లు గెలిచారు. 2014, 2018 ఎన్నికల్లో కరీంనగర్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి గెలిచారు. బండి సంజయ్ 2020 నుంచి 2023 జులై 4 వరకు బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. ఇటీవల బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమితుడయ్యారు. బండి సంజయ్‌ని 2023 జులై 29న బీజేపీ పార్టీ అధిష్ఠానం భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ప్రస్తుతం ఆయన మూడవసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఓడిపోయిన ఆయన.. మూడోసారి తప్పక గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. తనకున్న క్రేజ్‌తో, తాను చేసిన అభివృద్ధి పనులను చూసి నియోజకవర్గ ప్రజలను తననే గెలిపిస్తారని, అవినీతి, అరాచక బీఆర్ఎస్ పాలనకు చెరమగీతం పాడుతారని అంటున్నారు బండి సంజయ్.

కాంగ్రెస్ నేత పురుమల్ల శ్రీనివాస్..

కాంగ్రెస్‌ పార్టీ నుంచి పురుమల్ల శ్రీనివాస్ ప్రస్తుతం బొమ్మకల్ సర్పంచ్ గా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వ్యూహాత్మకంగా మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్ ను బరిలో దించింది. మంత్రి గంగుల విజయాలకు చెక్ పెట్టాలన్న లక్ష్యంతో ఈసారి శ్రీనివాస్ కు టెకెట్ ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. అలాగే బీజేపీ తరుఫున బరిలో ఉన్న బండి సంజయ్ కుమార్ కూడా మున్నూరు కాపు వర్గానికి చెందిన వారే. దీంతో ఒకే సమాజిక వర్గానికి చెందిన వారు బరిలో ఉండటం అందులో.. ఒకరు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్.. మరొకరు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. దీంతో ఈ నియోజకవర్గంలో ఎన్నికలు ఢీ అంటే ఢీ అన్నట్లుగా సాగననున్నాయి.

Also Read:

ప్రధాన పార్టీలకు రెబల్స్ గండం.. బుజ్జగింపులు షురూ చేసిన అగ్రనేతలు..

ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారు? పార్టీల వారీగా వివరాలు..

Advertisment
Advertisment
తాజా కథనాలు