అయోధ్య లంకలో Rtv

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు తగ్గినా వరద మాత్రం తగ్గలేదు. గోదావరి నది శాంతించినా. ముంపు ప్రాంతాల్లో ఉన్న లంక గ్రామాలు మాత్రం ఇంకా నీటిలోనే నానుతున్నాయి. ఎన్నికల సమయంలో జగన్‌ తమ గ్రామంలో బ్రిడ్జి నిర్మిస్తామని హామి ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక ఇటువైపు వచ్చి చూడలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

New Update
అయోధ్య లంకలో Rtv

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కురిసిన వర్షాలు అనేక గ్రామాలను నామరూపం లేకుండా చేశాయి. భారీ వరదలతో ఇళ్లు కోల్పోయి వేల మంది నిరాశ్రయులుగా మారారు. ముఖ్యంగా పశ్చిమగోదావరి(West Godavari) జిల్లాలోని ముంపు ప్రాంత గ్రామాలైన లంక గ్రామాలు ఇంకా వరదల్లో నానుతూనే ఉన్నాయి. నడుంలోతు నీళ్లలో అక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయోధ్య లంక(Ayodhya Lanka)లో Rtv బృందం పర్యటించింది. నడుంలోతు నీటిలోకి వెళ్లిన Rtv బృందం.. గ్రామాల్లో ప్రధాన రహదారిపై నిల్చుంటే రిపోర్టర్‌ నడుం వరకు నీరు చేరింది. నీటిలో నానుతున్న అయోధ్య లంక (Ayodhya Lanka)గ్రామస్తుల ఇళ్లు ఎప్పుడు కూలిపోతాయే తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు.

2019 ఎన్నికల్లో జగన్‌ మోహన్‌ రెడ్డి (Jagan Mohan Reddy) బ్రిడ్జిని నిర్మిస్తానని హామి ఇచ్చారని, కానీ ఇంతవరకు తమ గ్రామంలో ఎలాంటి బ్రిడ్జిని ఏర్పాటు చేయలేదన్నారు. తమ గ్రామం ముంపు ప్రాంతంలో ఉందని, భారీ వర్షాలు పడితే తమ గ్రామానికి వరద వచ్చే అవకాశం అధికంగా ఉందని తెలిపారు. సమీప ప్రాంతాల్లో భారీ వర్షం పడితే ఆ రోజంతా తమకు నిద్ర ఉండదని, ఎప్పుడు వరద వస్తుందో తెలియక బిక్కు బిక్కు మంటూ బ్రతకాల్సి వస్తోందని బాధితులు వాపోయారు. ఇటీవల భారీ వర్షం పడటంతో తమ ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరిందని, దీంతో తమ ఇళ్లలో ఉన్న సరుకులు పూర్తిగా వరదలో కొట్టుకుపోయాయన్నారు. ప్రభుత్వం తమకు ఎలాంటి సహాయం చేయలేదని, తమను పునరావాస కేంద్రాల్లోకి సైతం తరలించలేదని వాపోయారు. ఎన్డీఆర్‌ఎఫ్‌(ndrf) అధికారులు మాత్రమే వచ్చి తమకు ఆహార పదార్థలు ఇచ్చి వెళ్లేవారని వెల్లడించారు.

తాము అయోధ్య లంక (Ayodhya Lanka) నుంచి పక్క గ్రామానికి వెళ్లాలంటే తమకు పడవే ఆధారమన్నారు. సరైన రవాణా వ్యవస్థ లేకపోవడంతో తాము పడవల ద్వారా వాగులు దాటుతూ ఇతర గ్రామాలకు వెళ్తున్నామన్నారు. అంతే కాకుండా భారీ వరదలు తమ జీవనాధారాన్ని దెబ్బతీశాయని బాధితులు వెల్లడించారు. తాము చేపల వేటకు వెళ్లి జీవనం సాగించే వారిమని, ఈ వరదల వల్ల సముద్రంలోకి వెళ్లలేకపోతున్నామని, దీంతో తమకు అనేక సమస్యలు చుట్టు ముట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వరదలు తగ్గితే కానీ తాము మళ్లీ జీవనం సాగించలేమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు బ్రిడ్జిని నిర్మించాలని గ్రామస్తులు కోరారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు