శాంతి నెలకొనేలా చూడండి.. మణిపూర్ గవర్నర్‌కు విపక్ష కూటమి అభ్యర్థన

మణిపూర్‌లో పర్యటిస్తున్న ప్రతిపక్ష కూటమి ఇండియా ప్రతినిధుల బృందం రాష్ట్ర గవర్నర్‌ అనుసూయి ఉయికేని కలుసుకున్నారు. మెమోరాండం సమర్పించారు. మణిపూర్‌లో శాంతి, సామరస్యాన్ని పునరుద్ధరించాలని, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని మెమోరాండంలో పేర్కొన్నారు.

New Update
శాంతి నెలకొనేలా చూడండి.. మణిపూర్ గవర్నర్‌కు విపక్ష కూటమి అభ్యర్థన

మణిపూర్‌లో శాంతి నెలకొనేలా చూడాలని రాష్ట్ర గవర్నర్ అనసూయ ఉయికేని విపక్ష కూటమి 'ఇండియా' కు చెందిన ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసింది. ఈ రాష్ట్రంలోని ప్రజలను . . ముఖ్యంగా షెల్టర్ హోమ్స్ లో తలదాచుకుంటున్న నిర్వాసితులను తాము కలుసుకున్నామని, వారి పరిస్థితులపై గవర్నర్ కు ఓ మెమోరాండం సమర్పించామని ఆ తరువాత కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ తెలిపారు. కుకీ, మెయితీలు ఉంటున్న ప్రాంతాల్లోని రిలీఫ్ క్యాంపు లను నిన్న తాము విజిట్ చేశామని ఆయన చెప్పారు. ప్రభుత్వం వీరికి కేవలం 'దాల్ చావల్' మాత్రమే ఇస్తోందన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పునరుద్ధరణ విషయంలో వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను అభ్యర్థించినట్టు వెల్లడించారు. ఈ రాష్ట్రంలోని పరిస్థితులను తెలుసుకునేందుకు తమ ప్రతినిధి బృందమొక్కటే చొరవ చూపిందని, అఖిల పక్ష బృందాన్ని తీసుకువెళ్లాలని ప్రధాని మోడీ యోచించి ఉంటే మేము కూడా ఆ బృందంలో ఓ భాగమై ఉండేవారమని ఆయన చెప్పారు. ఇక్కడి పరిస్థితులను తాము పార్లమెంటు దృష్టికి తీసుకువెళ్తామన్నారు.

దయనీయంగా నిర్వాసితుల పరిస్థితి

పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్న నిర్వాసితుల పరిస్థితి దయనీయంగా ఉందని ఈ ప్రతినిధి బృందంలోని సభ్యురాలు, ఎంపీ కనిమొళి తెలిపారు. షెల్టర్ హోమ్స్ లో వారికి ఏ ఏమాత్రం తగిన సౌకర్యాలు లేవని, వారికి ఇస్తున్న ఆహారం కూడా సరిపోవడం లేదని ఆమె చెప్పారు. ఇప్పటికీ వారిలో అభద్రతాభావం నెలకొని ఉందని, వారి ఆందోళనను తాము గమనించామన్నారు. చురా చంద్ పూర్, ఇంఫాల్, మొయిరాంగ్ జిల్లాల్లోని షెల్టర్ హోమ్స్ ని తాము సందర్శించామన్నారు. ప్రభుత్వం వీరి పునరావాస శిబిరాల్లో సరైన సదుపాయాలు కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

21 మంది ఎంపీల సందర్శన

మణిపూర్ ను 21 మంది విపక్ష కూటమి ఎంపీలు సందర్శించారు. కాంగ్రెస్ నుంచి గౌరవ్ గొగోయ్, అధిర్ రంజన్ చౌదరి, తృణమూల్ కాంగ్రెస్ నుంచి సుష్మితా దేవ్, ఝార్ఖండ్ ముక్తి మోర్చా తరఫున మహువా మాజీ, డీఎంకే తరఫున కనిమొళి, ఎన్సీపీ నుంచి మహ్మద్ ఫైజల్, ఆర్ఎల్డీ నుంచి జయంత్ చౌదరి, ఆర్జేడీ నుంచి మనోజ్ కుమార్ ఝా, ఇంకా జేడీయు తరఫున రాజీవ్ రంజన్ లలన్ సింగ్, సీపీఐ, సీపీఎం లనుంచి సంతోష్ కుమార్, ఏఏ. రహీం తదితరులు వీరిలో ఉన్నారు. తమ విజ్ఞప్తిని గవర్నర్ సావధానంగా ఆలకించారని, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని గౌరవ్ గొగోయ్ వెల్లడించారు. రెండో రోజైన ఆదివారం కూడా తాము ఈ రాష్ట్రంలో మరికొన్ని పునరావాస శిబిరాలను సందర్శిస్తామని ఆయన చెప్పారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు