Khairatabad Ganesh: రేపు ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర సాగేది ఎలాగంటే..?

తొమ్మిది రోజులుగా భక్తుల పూజలు అందుకున్న ఖైరతాబాద్ లంబోదరుడు గంగమ్మ తల్లి ఒడిలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. బడా గణేష్ మహా నిమజ్జనానికి సంబంధించిన ఉత్సవ కమిటీ ఈ మేరకు ఏర్పాట్లు షురూ చేసింది. బుధవారం అర్థరాత్రి 12 గంటలకు మహాగణపతి చివరి పూజ అందుకుంటారు.

New Update
Khairatabad Ganesh: రేపు ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర సాగేది ఎలాగంటే..?

Khairatabad Ganesh: తొమ్మిది రోజులుగా భక్తుల పూజలు అందుకున్న ఖైరతాబాద్ లంబోదరుడు గంగమ్మ తల్లి ఒడిలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. బడా గణేష్ మహా నిమజ్జనానికి సంబంధించిన ఉత్సవ కమిటీ ఈ మేరకు ఏర్పాట్లు షురూ చేసింది. బుధవారం అర్థరాత్రి 12 గంటలకు మహాగణపతి చివరి పూజ అందుకుంటారు. అనంతరం నిమజ్జనం కోసం మహాగణపతిని భారీ టస్కర్‌లోకి ఎక్కించే ఏర్పాట్లు చేయనున్నారు. అర్ధరాత్రి 2 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు ఈ కార్యక్రమం పూర్తి చేయనున్నారు. తదుపరి 4 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మహాగణపతిని భారీ వాహనంపైకి ఎక్కించి వెల్డింగ్ వర్క్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత 6 గంటల నుంచి శోభాయాత్ర ప్రారంభం కానుంది.

టెలిఫోన్ భవన్, సచివాలయం మీదుగా ఈ యాత్ర ఎన్టీఆర్ మార్గ్ చేరుకుంటుంది. ఉదయం 10 గంటలకు ట్యాంక్‌బండ్‌పై ఉన్న క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకుంటారు మహా గణపతి. అనంతరం భారీ వాహనంపై నుంచి మహాగణపతి విగ్రహం తొలగింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. క్రేన్ నెంబర్ 4 వద్ద ఉదయం 10.30 గంటలకు పూజా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు మహాగణపతి నిమజ్జనం పూర్తి చేయనున్నారు. ఈ మేరకు ఉత్సవ కమిటీ సభ్యులు ప్రకటించారు.

మరోవైపు బాలాపూర్ గణేష్ శోభాయాత్ర కూడా పాతబస్తీలోని చాంద్రాయాణ గుట్ట, చార్మినార్, అప్ఝాల్ గంజ్, అబిడ్స్, ఎంజే మార్కెట్, హుస్సేన్ సాగర్ వరకు 19 కి.మీ మేర జరగనుంది. ప్రతి ఏడాది వినాయక నవరాత్రులను ఘనంగా నిర్వహించే హైదరాబాద్ వాసులు ఈ సారి కూడా రికార్డు స్థాయిలో గణేష్ ప్రతిమలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలు విగ్రహాల నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. ఇక నవరాత్రులు చివరి దశకు చేరుకోవడంతో మిగిలిన రెండు రోజుల నగరంలోని అన్ని విగ్రహాలు నిమజ్జనానికి సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్‌ నియంత్రణ, శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ రూం నుంచి నిమజ్జన ఏర్పాట్లను ఉన్నతాధికారులు పరిశీలించనున్నారు. ఈ క్రమంలో పోలీసులు నిమజ్జనానికి వచ్చే భక్తులకు పలు సూచనలు చేశారు.

ఇక గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర సందర్భంగా భక్తులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది తెలంగాణ ఆర్టీసీ (TSRTC). భక్తుల సౌకర్యార్థం 535 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఒక్కో డిపో నుంచి 15 నుంచి 20 బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (RTC MD Sajjanar) తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ (X) ఖాతా ద్వారా ప్రకటన విడుదల చేశారు. వినాయకుడి నిమజ్జనంలో పాల్గొనే భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంస్థ అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రత్యేక బస్సులకు సంబంధించిన సమాచారం కోసం రెతిఫైల్‌ బస్‌ స్టేషన్‌ – 9959226154, కోఠి బస్‌ స్టేషన్‌ – 9959226160 నంబర్లను సంప్రదించాలని సజ్జనార్ సూచించారు.

ఇది కూడా చదవండి: మద్యం తాగి నిమజ్జనానికి రావొద్దు.. 25 వేల మందితో భారీ బందోబస్తు

Advertisment
Advertisment
తాజా కథనాలు