Manchu Manoj: రీల్ హీరో కాదు... రియల్ హీరో అనిపించుకున్న మంచు మనోజ్

మంచు మనోజ్ మాతృదేవోభవ అనాథ ఆశ్రమాన్ని సందర్శించి మానసిక సమస్యలతో బాధపడుతున్న సంతోష్‌కు సహాయం చేశారు. హెయిర్ కట్, కొత్త బట్టలు ఏర్పాటు చేసి అతనిలో ఆత్మవిశ్వాసం పెంచారు. ఆశ్రమానికి అవసరమైన సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు.

New Update
Manchu Manoj

Manchu Manoj

Manchu Manoj: నటుడు మంచు మనోజ్ మరోసారి తన మంచి మనసుతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. “సెలబ్రిటీ పుణాత్మ ఛాలెంజ్”లో భాగంగా ఆయన మాతృదేవోభవ అనాథ ఆశ్రమాన్ని సందర్శించి అక్కడి వారికి సహాయం చేశారు. ముఖ్యంగా మానసిక సమస్యలతో బాధపడుతున్న అనాథ యువకుడు సంతోష్‌కు ఆయన ఇచ్చిన మద్దతు సోషల్ మీడియాలో ఎంతో మందిని భావోద్వేగానికి గురిచేస్తోంది.

ఆశ్రమానికి వెళ్లిన మనోజ్, సంతోష్‌కు పూర్తిగా కొత్త రూపం వచ్చేలా ప్రత్యేకంగా కేర్ చేశారు. హెయిర్ కట్, షేవింగ్, కొత్త బట్టలు, గ్రూమింగ్ ఏర్పాటు చేసి అతనికి మంచి లుక్ తీసుకొచ్చారు. మేకోవర్ తర్వాత సంతోష్‌ను చూసి “సంతోష్ భాయ్... ఇప్పుడు హీరోలా ఉన్నావ్” అంటూ మనోజ్ ప్రోత్సహించడం అక్కడ ఉన్న వారిని కదిలించింది.

ఈ సందర్భంగా మాట్లాడిన మనోజ్, ఆశ్రమ నిర్వాహకుడు గిరి రెండు నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తనను సంప్రదించారని చెప్పారు. సినిమా షూటింగ్స్ వల్ల వెంటనే రాలేకపోయినా, ఆ విషయం తన మనసులో ఉండిపోయిందని, చివరకు స్వయంగా వచ్చి పరిస్థితిని చూడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

మానసిక సమస్యలతో వీధుల్లో తిరిగే వారిని సమాజం ఎలా నిర్లక్ష్యం చేస్తుందో మనోజ్ ఎమోషనల్ గా చెప్పారు. “ఇప్పటికీ చాలామందిని అంటరానివారిలా చూస్తున్నారు. మనం 2026లో ఉన్నాం. డాక్టర్లు, సదుపాయాలు అన్నీ ఉన్నా, ఇంకా వాళ్లను పట్టించుకోకుండా వదిలేస్తున్నారు” అని అన్నారు.

కేవలం జాలి చూపించడం సరిపోదని, అలాంటి వారికి గౌరవం, సాధారణ జీవితం తిరిగి ఇవ్వాలని ఆయన చెప్పారు. భవిష్యత్తులో మానసిక సమస్యలతో బాధపడేవారికి ప్రత్యేక రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా ఉందని వెల్లడించారు. ఇప్పటికే ప్లాన్ చేస్తున్న స్పోర్ట్స్ రిహాబిలిటేషన్ సెంటర్‌తో పాటు దీనిపైనా పని చేయాలని చూస్తున్నట్లు చెప్పారు.

ఆశ్రమంలో సరైన సదుపాయాలు లేకపోవడంతో అక్కడి వారు చెట్ల కింద కూర్చొని భోజనం చేస్తుండటాన్ని చూసిన మనోజ్ వెంటనే టేబుల్స్, కుర్చీలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే AIKYA DHAIRYA SENA SAMITHI తరఫున ఆశ్రమానికి సహాయం కొనసాగుతుందని తెలిపారు.

ఆశ్రమ నిర్వాహకుడు గిరి మాట్లాడుతూ, మనోజ్ వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. చాలామంది వస్తామని చెప్పి రాకపోయినా, మనోజ్ మాత్రం నిజంగా వచ్చి అక్కడి వారితో సమయం గడిపారని తెలిపారు. సంతోష్ గత రెండేళ్లుగా చాదర్‌ఘాట్ ప్రాంతంలో తిరుగుతూ ఉండేవాడని, తర్వాత ఆశ్రమానికి తీసుకొచ్చామని చెప్పారు.

“మనిషితో కేవలం అరగంట ఓపికగా మాట్లాడినా, అతనిలో మళ్లీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది” అని గిరి అన్నారు. అలాగే ఆశ్రమంలో ఉన్న వారికి మానసిక వైద్య సేవలు అందించేందుకు సహాయం చేయాలని మనోజ్‌ను కోరారు.

ఇలా ఆశ్రమంలో ఉన్న వారితో వ్యక్తిగతంగా సమయం గడిపిన తొలి సినీ నటుడు మనోజ్ అని గిరి చెప్పారు. సమాజం మరిచిపోయిన వారికి మనోజ్ ఆశ, ధైర్యం ఇచ్చారని ప్రశంసించారు.

ఇక సినిమాల విషయానికి వస్తే, మంచు మనోజ్ ప్రస్తుతం ‘డేవిడ్ రెడ్డి’, ‘రక్షక్’, ‘మోహన రాగ’, 'NBK 111' వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన చురుకుగా పాల్గొంటున్నారు.

Advertisment
తాజా కథనాలు