Puri Jagannadh: సైన్స్‌ నిజం చెబుతుంది.. నమ్మకం కథ చెబుతుంది - పూరి జగన్నాథ్‌ పవర్‌ఫుల్‌ మాటలు వింటే!

దర్శకుడు పూరి జగన్నాథ్‌ సైన్స్‌ ఆధారాలపై నడుస్తుందని, నమ్మకం భావాలపై ఆధారపడుతుందని చెప్పారు. ప్రతి విషయాన్ని ప్రశ్నించి సాక్ష్యాలతోనే నమ్మాలని సూచించారు. సైంటిఫిక్‌ ఆలోచన అవసరమని, సైన్స్‌ నిజం చూపిస్తే నమ్మకం మనసుకు ధైర్యం ఇస్తుందని వివరించారు.

New Update
Puri Jagannadh

Puri Jagannadh

Puri Jagannadh: ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ Puri Jagannadh కొంత విరామం తర్వాత తన ‘పూరి మ్యూజింగ్స్‌’లో కొత్త విషయంపై మాట్లాడారు. ఈసారి ఆయన సైన్స్‌, నమ్మకం గురించి తన అభిప్రాయాలు పంచుకున్నారు.

ఆయన చెప్పినట్టు, మనం ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలంటే శాస్త్రాన్ని ఆధారంగా తీసుకోవాలి. సంప్రదాయాలు లేదా విన్న కథల మీద మాత్రమే ఆధారపడకూడదని అన్నారు. సైన్స్‌ ఎప్పుడూ ఆధారాలు, పరీక్షలు చూసి మాత్రమే నిజం అని చెబుతుంది. కానీ నమ్మకం మాత్రం కథలు, భావాల నుంచి వస్తుందని వివరించారు.

ప్రపంచం కొన్ని నియమాలపై నడుస్తుందని సైన్స్‌ చెబుతుంది. మనం ఎలా నమ్మినా ఆ నియమాలు మారవు. ఉదాహరణకు, ఏదైనా వస్తువు కింద పడితే అది గురుత్వాకర్షణ వల్లే పడుతుంది. ఈ విషయాన్ని మన నమ్మకం మార్చలేదని చెప్పారు. అందుకే ప్రతి విషయాన్ని ప్రశ్నించాలి, సాక్ష్యాలు లేకుండా ఏదీ నమ్మకూడదని సూచించారు.

స్కూల్‌, కాలేజీల్లో నేర్చుకునే శాస్త్రాన్ని విశ్వసించాలి కానీ సమాజంలో వినిపించే ప్రతి మాటను నమ్మకూడదని అన్నారు. సైన్స్‌ మనకు నిజం చూపించడానికి ఉంటుంది. ఏదైనా విషయం మనకు తెలియకపోతే, అది సైన్స్‌ ఇంకా కనుగొనలేదని అర్థం అని చెప్పారు.

సైన్స్‌ ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకుంటూ ముందుకు సాగుతుందని, మనం కూడా అలానే ఆలోచించడం అలవాటు చేసుకోవాలని చెప్పారు. ఊహల కంటే ఆధారాలను నమ్మడం నేర్చుకోవాలి. ఏదైనా సంప్రదాయం నమ్మాల్సి వస్తే “ఎందుకు?” అని మనల్ని మనం అడగాలని సూచించారు.

చరిత్రలో చెప్పిన విషయాలనూ ప్రశ్నించాలి, అవి నిజమా కాదా తెలుసుకోవాలని అన్నారు. ఇంకా భూమి బల్లపరుపుగా ఉందని నమ్మే వారు ఉన్నారని చెప్పి, సైంటిఫిక్‌ థింకింగ్‌ ఎంత అవసరమో గుర్తు చేశారు.

మొత్తానికి, పూర్తిగా నమ్మకాలపై ఆధారపడితే లాజిక్‌ తగ్గిపోతుందని చెప్పారు. సైన్స్‌ మనల్ని చంద్రమండలానికి తీసుకెళ్తే, నమ్మకం మనల్ని స్వర్గం వైపు తీసుకెళ్తుందని తనదైన శైలిలో వివరించారు.

Advertisment
తాజా కథనాలు