AP: వితంతువుకు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ వేధింపులు.. ఇప్పుడే రూ.5 వేలు ఇస్తా అంటూ..!
అనంతపురం జిల్లా శింగనమలలో వితంతువును ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ వేధింపులకు గురిచేశాడు. 'అక్కా' అంటూనే తన లైంగిక వాంఛ తీర్చాలని పదే పదే ఫోన్స్ చేసి ఇబ్బందులకు గురిచేసినట్లు తెలుస్తోంది. దీంతో బాధిత మహిళ అతడు మాట్లాడిన ఆడియో ఆధారంగా పోలీసులను ఆశ్రయించింది.
Ananthapur: అక్కా అంటూనే ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ తనను వేధింపులకు గురిచేశాడని ఓ వితంతువు ఆవేదన వ్యక్తం చేస్తోంది. అసలేం జరిగిందంటే.. అనంతపురం జిల్లా శింగనమల మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ప్రతి రాత్రీ ఫోన్ చేసి.. 'అక్కా' అంటూనే తన లైంగిక వాంఛ తీర్చాలని వేధిస్తున్నాడు. దీంతో బాధితురాలు కాల్ రికార్డింగ్ చేసి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు నిందితుడు శ్రీనివాసులు నాయుడుపై శింగనమల పోలీసులు కేసు నమోదు చేశారు.
బాధితురాలి భర్త పదేళ్ల క్రితం మృతి చెందాడు. కూలి పనులు చేసుకుంటూ ఆమె కుమారులను పోషిస్తోంది. ఆదే గ్రామానికి చెందిన శ్రీనివాసులు నాయుడు ఆమెను కొన్నాళ్లుగా వేధిస్తున్నాడు. 'నువ్వు పనులకు రాకపోయినా పరవాలేదు.. నా వద్దకు రా.. డబ్బు సంపాదించుకో. నువ్వు బాగుండు.. నేనూ బాగుంటా.. నీకు బయటకు వచ్చేందుకు వీలవుతుందా..? ఇప్పుడే రూ.5 వేలు ఇస్తా.. రూ.3 లక్షలు లోన్ ఇప్పిస్తా..' అని ఓ వితంతువు పట్ల అను చితంగా ప్రవర్తించాడు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్.
ఆమెకు పదే పదే ఫోన్స్ చేసి వేధింపులకు గురిచేసేవాడు. 'నీకూ పెళ్లాం పిల్లలు ఉంటారు కదా శీనూ.? వాళ్లను ఎవరైనా ఇట్ల అడిగితే ఊరికే ఉంటావా..?' అని బాధిత మహిళ ప్రశ్నించినా.. తన తీరు మారలేదు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై కేసు నమోదు చేశామని సీఐ కౌలుట్లయ్య తెలిపారు. ప్రస్తుతం ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
Man Marries Two Women : ఒకే ముహూర్తంలో ఇద్దరమ్మాయిలతో పెళ్లి...విషయం తెలిస్తే నవ్వాపుకోలేరు
ఏపీకి సంబంధించిన ఓ వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో వింతేముంది అనుకుంటున్నారా? నిజానికి అన్ని పెళ్లి కార్డుల్లాగే అది కూడా సాధారణమైన కార్డే. కానీ వరుడు ఒక్కడు.. వధువులు ఇద్దరు కావడంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Man Marries Two Women: ఏపీకి సంబంధించిన ఓ వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో వింతేముంది అనుకుంటున్నారా? నిజానికి అన్ని పెళ్లి కార్డుల్లాగే అది కూడా సాధారణమైన కార్డే. కానీ వరుడు ఒక్కడు.. వధువులు ఇద్దరు కావడంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన యువకుడు అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పుడు ఈ కార్డు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఒకే హీరోను ఇద్దరు అక్కచెల్లెళ్లు ఇష్టపడడం సినిమాల్లో మాత్రమే సాధ్యమవుతుంది. సినిమాల్లోనూ చివరికి ఎవరో ఒకరు త్యాగం చేయడం సర్వసాధారణం కానీ సత్యసాయి జిల్లాకు చెందిన ఒక వరుడికి అక్కాచెల్లెళ్లను ఇచ్చి పెళ్లి చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. ఒకే ముహూర్తంలో, ఒకే మండపంలో అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకునేందుకు వరుడు సిద్ధమయ్యాడు. బంధువులు, సన్నిహితుల్ని ఆహ్వానిస్తూ శుభలేఖలు కూడా ప్రింట్ చేశారు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పెళ్లి కార్డు వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.
శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గుమ్మగారిపల్లికి చెందిన గంగులమ్మ రాజువేలు కుమారుడు గంగరాజుకు.. కర్ణాటకలోని చిక్కబళ్లాపురం జిల్లా బాగేపల్లి టౌన్కు చెందిన కె సుశీల రఘుల కుమార్తెలు శ్రీలక్ష్మి, ఐశ్వర్యలను ఇచ్చి పెళ్లి చేస్తున్నట్లు కార్డులో ప్రింట్ చేశారు. ఈ నెల 10న ఉదయం ముహూర్తం కాగా.. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల పట్టణం బెంగళూరు రోడ్, గుమ్మ్యగారిపల్లి క్రాస్ దగ్గర ఉన్న రంగమహాల్లో పెళ్లి చేస్తున్నారట. పెళ్లికి ముందు రోజు అంటే ఈ నెల 9న రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. అక్కాచెల్లెళ్లను ఒకే యువకుడికి ఇచ్చి పెళ్లి చేయడం వెనుక కారణం ఏంటని సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
శ్రీసత్యసాయి జిల్లా కర్ణాటకకు సరిహద్దులో ఉంటుంది.. దీంతో స్థానికులు కొందరు ఉపాధి కోసం కర్ణాటకకు వెళ్లి అక్కడే స్థిరపడతారు.. పొరుగునే ఉన్న అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలో పెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటారు.. ఈ క్రమంలోనే శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన యువకుడ్ని కర్ణాటకకు చెందిన ఇద్దరు వధువులతో పెళ్లి చేస్తున్నారు. మొత్తానికి ఈ ఆయనకిద్దరు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ వెడ్డింగ్ కార్డ్ పోస్ట్ కింద నెటిజన్లు స్పందిస్తున్నారు. 'లోకం మారుతోంది అంటే ఏంటో అనుకొన్న, ఈ వెడ్డింగ్ చూసి నిజమనిపిస్తోంది.. ఒకేసారి ఇద్దరమ్మాయిల ముద్దుల మొగుడుగా.. తమ్ముడు గంగరాజు నీ గుండె పది కాలాలు బ్రతకాలి' అంటూ వెడ్డింగ్ కార్డును షేర్ చేశారు ఓ నెటిజన్.
'పేరు మారింది కావచ్చు. అందుకే అలా రాసారేమో' అని ఒక నెటిజన్ అంటే.. 'ముందు నీ ఆరోగ్యం జాగ్రత్త రా బాబు... నీ ఆరోగ్యం బాగుంటే అన్ని బాగుంటాయి. ఆ.విషయంలో ఇద్దరినీ మెయింటైన్ చేయాలి అంటే కొంచెం కష్టంతో కూడుకున్న పని అనుకో.. ముందు ధూమపానం మద్యపానం వంటి అలవాట్లు ఉంటే మానుకో.. లేకపొతే ముందు ముందు ఆ రెండు వ్యసనాలకు శాశ్వతంగా బానిస కావాల్సి ఉంటుంది.. జాగ్రత్త' అని మరొకరు సలహా ఇస్తూ రిప్లై ఇచ్చారు. 'ఒక్కరిని కట్టుకున్నాందుకే బాధపడుతుంటే, మరి నీ పరిస్థితి ఏంటి? గట్టి గుండె అనిచెప్పాలి' అంటూ మరో నెటిజన్ సరదాగా కామెంట్ చేశారు. అయితే ఇద్దరిలో ఒకరికి ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నాయోమో అందుకే ఒకరికే ఇచ్చి పెళ్లి చేస్తున్నారని మరొకరు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్చనీయాంశంగా మారింది.