/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/2018-jpg.webp)
2018 Movie: ఆస్కార్ అవార్డు కోసం ఈ ఏడాది అధికారికంగా ఒకే ఒక్క చిత్రం భారత్ తరపున ఎంపికైంది. గతేడాది 'ఆర్ఆర్ఆర్' చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో యావత్ ప్రపంచం భారత సినిమాల వైపు చూడటం మొదలుపెట్టింది. ప్రపంచంలో ఏ మూలన చూసినా నాటు నాటు ఎంతలా మార్మోగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు 2024 ఆస్కార్ అవార్డుకు ఏ భారత చిత్రం పోటీ పడనుందోననే ఆసక్తి సినీ అభిమానుల్లో నెలకొంది. అయితే మలయాళంలో చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న '2018-ఎవ్రీ వన్ ఈజ్ హీరో' సినిమాను అధికారికంగా 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫ్యూచర్ ఫిలిం' కేటగిరి కింద ఆస్కార్ అవార్డుకు పంపుతున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
Malayalam film "2018- Everyone is a Hero" India's official entry for Oscars 2024: Film Federation of India
— Press Trust of India (@PTI_News) September 27, 2023
2018లో కేరళను ముంచెత్తిన వరదల నేపథ్యంలో ఈ సినిమాను ఎంతో సృజన్మాతకంగా తెరకెక్కించారు. వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వాధికారులతో పాటు, ప్రజలు కూడా స్పందించి తోటి ప్రజలను ఎలా కాపాడుకున్నారనే కథాంశంతో ఈ చిత్రం నిర్మితమైంది. అభిమానులతో పాటు విమర్శకుల ప్రసంశలు అందుకున్న ఈ సినిమా వసూళ్లలోనూ రికార్డు సాధించింది. ఈ చిత్రంలో మలయాళ యువ కథానాయకుడు టోవినో థామస్ ఓ కీలక పాత్రలో నటించారు. ఆకాశమే హద్దురా ఫేమ్ అపర్ణ బాలమురళి, లాల్, అసిఫ్ అలీ, వినీత్ శ్రీనివాసన్, తన్వి రామ్, కున్చకో బోబన్, అజు వర్గీస్, నరైన్, కలైయారసన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. మే 25న కేరళలో విడుదలైన ఈ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి జాతీయ ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంది. వసూళ్ల ప్రభంజనం సృష్టించిన ఈ సినిమాను మే 26న తెలుగులో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ మీద బన్నీ వాసు విడుదల చేశారు. తెలుగులోనూ మంచి హిట్ అందుకుంది ఈ చిత్రం.
ఇంతకు ముందు ఆమిర్ ఖాన్ నటించిన 'లగాన్' సినిమా అధికారికంగా ఎంపికైనప్పుడు ఆస్కార్ నామినేషన్స్ వరకు నిలిచింది. అయితే అవార్డు మాత్రం అందుకోలేకపోయింది. మళ్లీ ఇప్పుడు 2018 చిత్రాన్ని అధికారికంగా ఆస్కార్ అవార్డు కోసం పంపిస్తున్నారు. తెలుగు సినిమాలు బలగం, దసరా మూవీలు కూడా ఆస్కార్ అవార్డు ఎంపిక కోసం పోటీ పడినా.. చివరకు ఫెడరేషన్ సభ్యులు 2018 మూవీని ఎంపిక చేశారు.