ఇండియాకు ఇరాన్ గుడ్‌న్యూస్.. 5 మిత్రదేశాలకు హర్మూజ్ జలసంధి పర్మిషన్

హర్మూజ్ జలసంధి గుండా భారత నౌకల రాకపోకలకు లైన్ క్లియర్ అయ్యింది. భారత్‌తో పాటు మరో నాలుగు మిత్ర దేశాలకు చెందిన నౌకలను తమ జలసంధి గుండా అనుమతిస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ సంచలన ప్రకటన చేశారు.

New Update
_Strait of Hormuz

అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన 'హర్మూజ్ జలసంధి' గుండా భారత నౌకల రాకపోకలకు లైన్ క్లియర్ అయ్యింది. భారత్‌తో పాటు మరో నాలుగు మిత్ర దేశాలకు చెందిన నౌకలను తమ జలసంధి గుండా అనుమతిస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ సంచలన ప్రకటన చేశారు. ఈ విషయాన్ని ముంబయిలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం అధికారికంగా Xలో తెలిపింది. భారత్‌కు ఇరాన్ ప్రాధాన్యత ఇవ్వడం దౌత్యపరంగా కీలక పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

మిత్ర దేశాలకు మాత్రమే చోటు
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వెల్లడించిన వివరాల ప్రకారం.. చైనా, రష్యా, భారత్, ఇరాక్, పాకిస్థాన్‌లను తమ అత్యంత ఆప్త మిత్ర దేశాలుగా ఇరాన్ గుర్తించింది. ఈ ఐదు దేశాల నౌకలకు హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించేందుకు ఎటువంటి ఆటంకాలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న అంతర్జాతీయ దౌర్జన్యాలకు మద్దతు ఇవ్వని దేశాలకు మాత్రమే ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఇరాన్ గుర్తుచేసింది.

చిక్కుకుపోయిన భారత నౌకలకు విముక్తి
ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయంతో గత కొంతకాలంగా హర్మూజ్ జలసంధికి ఇరువైపులా నిలిచిపోయిన భారత నౌకలకు మార్గం సుగమమైంది. ముఖ్యంగా గ్యాస్ ట్యాంకర్లు, ఇతర నిత్యావసర సరకులతో ఉన్న ఐదు భారీ నౌకలు ఇప్పటికే అనుమతుల కోసం వేచి చూస్తున్నాయి. ఇరాన్ తాజా ప్రకటనతో ఈ నౌకలు క్షేమంగా భారత తీరానికి చేరుకునే అవకాశం ఉంది. దీనివల్ల దేశంలో ఇంధన సరఫరా, వాణిజ్య కార్యకలాపాలకు ఊతం లభించనుంది.

కొత్తగా 'టోల్' నిబంధన?
మరోవైపు, హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై ప్రత్యేకంగా 'టోల్' (రుసుము) విధించే దిశగా ఇరాన్ అడుగులు వేస్తోంది. ఈ మేరకు ఇరాన్ పార్లమెంట్ ఒక కొత్త చట్టాన్ని రూపొందిస్తున్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ 'బ్లూమ్‌బెర్గ్' వెల్లడించింది. అయితే, ఈ రుసుము వసూలు చేసినందుకు ప్రతిఫలంగా ఆయా నౌకలకు ఇరాన్ సైన్యం పూర్తిస్థాయి రక్షణ కల్పిస్తుందని సమాచారం. సముద్ర దొంగల ముప్పు నుంచి, ఇతర అవాంఛనీయ సంఘటనల నుంచి రక్షణ కల్పిస్తూ నౌకలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే బాధ్యతను ఇరాన్ తీసుకోనుంది. 

Advertisment
తాజా కథనాలు