/rtv/media/media_files/2026/03/18/india-2026-03-18-08-14-35.jpg)
భారత(india) ఈశాన్య సరిహద్దుల్లో డ్రోన్ యుద్ధతంత్రంపై శిక్షణ ఇస్తున్నారనే ఆరోపణలతో అమెరికాకు చెందిన మాథ్యూ వాన్డైక్(Matthew VanDyke) అనే వ్యక్తిని, మరో ఆరుగురు ఉక్రెయిన్ పౌరులను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్ట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. భారత్ మీదుగా మయన్మార్లోకి అక్రమంగా ప్రవేశించి, అక్కడ ఉన్న సాయుధ గ్రూపులకు శిక్షణ ఇస్తున్నారనే ప్రధాన ఆరోపణలు వీరిపై ఉన్నాయి. మయన్మార్ సరిహద్దు రాష్ట్రాలైన మిజోరం వంటి ప్రాంతాల ద్వారా ఈ అక్రమ రవాణా సాగుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.
అసలు ఎవరీ మాథ్యూ వాన్డైక్ అని పరిశీలిస్తే, ఇతను అంతర్జాతీయ స్థాయిలో వివాదాస్పద వ్యక్తిగా గుర్తింపు పొందారు. తనను తాను సెక్యూరిటీ అనలిస్ట్, వార్ కరస్పాండెంట్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్గా పరిచయం చేసుకునే వాన్డైక్, 2011లో లిబియా అంతర్యుద్ధంలో తిరుగుబాటుదారులతో కలిసి పోరాడి జైలుకు వెళ్లినప్పుడే వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత సన్స్ ఆఫ్ లిబర్టీ ఇంటర్నేషనల్ (SOLI) అనే సంస్థను స్థాపించి, ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలు జరిగే ప్రాంతాల్లోని స్థానిక సాయుధ బృందాలకు సైనిక శిక్షణ, వ్యూహాత్మక సలహాలు అందించడం మొదలుపెట్టారు.
ఎన్.ఐ.ఏ అధికారులు వాన్డైక్ను కోల్కతాలో అరెస్ట్ చేయగా, ఉక్రెయిన్ పౌరులను లక్నో, ఢిల్లీ ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నారు. వీరిని ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో ప్రవేశపెట్టగా, ఈ కుట్ర వెనుక ఉన్న అసలు కారణాలను, వారి నెట్వర్క్ను వెలికితీసేందుకు కోర్టు 11 రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. వీరందరినీ ఈ నెల 27న మళ్ళీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అరెస్ట్ చేసిన వారి నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లను అధికారులు ప్రస్తుతం క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నారు.
Also Read : ఆఫ్ఘన్ చరిత్ర రిపీట్ అయితే .. పాకిస్థాన్కు ఆఫ్ఘన్ స్టార్ వార్నింగ్!
టూరిస్ట్ వీసాలపై భారత్కు వచ్చి
దాదాపు 14 మంది ఉక్రెయిన్(ukraine) పౌరులు టూరిస్ట్ వీసాలపై భారత్కు వచ్చి, గౌహతి నుంచి మిజోరం చేరుకుని అక్కడి నుంచి అక్రమంగా మయన్మార్లోకి వెళ్లినట్లు ఎన్.ఐ.ఏ గుర్తించింది. వీరు మయన్మార్లోని ఎత్నిక్ ఆర్మ్డ్ గ్రూప్స్ (EAGs) కు డ్రోన్ల ద్వారా యుద్ధం చేయడంపై శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. యూరప్ నుంచి పెద్ద ఎత్తున డ్రోన్లను సేకరించి భారత్ మీదుగా మయన్మార్కు తరలిస్తున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. మయన్మార్లోని ఈ సాయుధ బృందాలకు దేశంలో నిషేధించబడిన తిరుగుబాటు సంస్థలతో సంబంధాలు ఉండటం ఇప్పుడు జాతీయ భద్రతకు పెను సవాలుగా మారింది.
ఈ విదేశీయులకు భారత్లో స్థానికంగా ఎవరైనా సహకరిస్తున్నారా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. గతేడాది మార్చిలో మిజోరం ముఖ్యమంత్రి లాల్దుహోమా కూడా ఇటువంటి హెచ్చరికలే చేశారు. అమెరికా, బ్రిటన్ దేశాలకు చెందిన మాజీ ప్రత్యేక దళాల సభ్యులు, కిరాయి సైనికులు మిజోరం మీదుగా మయన్మార్లోకి ప్రవేశించి అక్కడ శిక్షణ ఇస్తున్నారని ఆయన అప్పట్లో పేర్కొన్నారు. ఇప్పుడు మాథ్యూ వాన్డైక్ అరెస్ట్తో ఈ అంతర్జాతీయ నెట్వర్క్ గుట్టు రట్టవుతుందని అధికారులు భావిస్తున్నారు.
Also Read : అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్కు బిగ్షాక్.. NCTC చీఫ్ రాజీనామా
Follow Us