/rtv/media/media_files/2026/03/20/european-nations-2026-03-20-10-10-22.jpg)
European nations, Japan to join ‘appropriate efforts’ to open Hormuz Strait
మిడిల్ఈస్ట్లో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు ముదురుతున్నాయి. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన సంగతి తెలిసిందే. ఆ రూట్ గుండా వచ్చే నౌకలపై ఇరాన్ దాడులు చేయడంతో తీవ్ర అంతరాయం నెలకొంది. ఇప్పటికే అనేక దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ప్రపంచ ఇంధన సరఫరా గొలుసు దెబ్బతినకుండా ఉండేందుకు పలు దేశాలు ఏకమయ్యాయి.
బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ దేశాలు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. హర్ముజ్ జలసంధిలో నౌకలు సురక్షితంగా ప్రయాణించేలా చర్యలు తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించాయి. ఇటీవల హర్ముజ్ జలసంధిలో ఇరాన్ జరిపిన డ్రోన్, పేలుడు పదార్థాల దాడులను ఈ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ జలసంధి నుంచి వెళ్లే వందలాది వాణిజ్య నౌకలు నిలిచిపోవడంతో భారత్ సహా అనేక దేశాల్లో ఇంధన సంక్షోభం నెలకొంది.
Also Read: అమెరికాకు బిగ్ షాక్.. విదేశాల నుంచి దిగుమతులు.. స్థానిక కరెన్సీల్లోనే చెల్లింపులు
మరోవైపు సౌదీ అరేబియా, ఖతార్లోని చమురు, గ్యాస్ ప్లాంట్లపై జరిగిన దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఖతార్ ఎనర్జీకి చెందిన LNG ఎగుమతి సామర్థ్యం 17 శాతం తగ్గిపోయింది. దీనివల్ల ఏడాదికి సుమారు 20 బిలియన్ల డాలర్ల (సుమారు రూ.1.6 లక్షల కోట్ల) ఆదాయ నష్టం జరుగుతోంది.
ఈ క్రమంలోనే ఇంధన మార్కెట్లను స్థిరీకరించేందుకు ఆయా దేశాలు కలిసికట్టుగా కీలక చర్యలు తీసుకోనున్నాయి. ఇతర ఇంధన ఉత్పాదక దేశాలతో కలిసి చమురు, గ్యాస్ ఉత్పత్తిని పెంచనున్నాయి. సముద్ర మార్గాల్లో రవాణాకు ఎలాంటి అంతరాయం జరగకుండా చూసుకునేందుకు రక్షణను పెంచనుంది. అంతేకాదు పౌర మౌలిక సదుపాయాలపై దాడులను వెంటనే ఆపేయాలని.. ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడాలని ఇరాన్ను హెచ్చరించాయి.
Also Read: వీధిలో ఉమ్మినందుకు ఇద్దరు భారతీయులకు రూ.3.5 లక్షల జరిమానా
Follow Us