/rtv/media/media_files/2025/12/20/cm-revanth-2025-12-20-15-11-01.jpg)
CM Revanth
Revanth Reddy: తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు ఆస్కారమేలేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలు వస్తాయనేది ఊహాగానాలేనని కొట్టి పడేశారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి 2028లోనూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. జాతీయ స్థాయిలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాల నేపథ్యంలో 2029లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై కూడా సీఎం స్పందించారు. డ్రగ్స్ కేసులో పుట్టా మహేష్కి స్టేషన్ బెయిల్పై మా ప్రమేయం లేదన్నారు.
‘‘మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిబంధనల ప్రకారమే స్టేషన్ బెయిల్ ఇచ్చారు. దీనిలో మా ప్రమేయం ఏమీ లేదు. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు సిట్ వేశాం’’ అని రేవంత్ చెప్పారు. మహిళా రిజర్వేషన్లు ముందుగా అమల్లోకి వస్తే మంచిదేనని అభిప్రాయపడ్డారు. కాగా ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి పార్లమెంట్లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్గాంధీ, ప్రియాంకా గాంధీలను కలిశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్తో కలిసి ఢిల్లీవెళ్లిన ఆయన వారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన వేం నరేందర్రెడ్డిని రాహుల్, ప్రియాంకలకు రేవంత్ పరిచయం చేశారు.
మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై సీఎ రేవంత్ సీరియస్ అయ్యారు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా ఇప్పటికే 9 మంది పోలీస్ అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశామన్నారు. "ఈ కేసులో ఏలూరు ఎంపీ (పుట్టా మహేష్ కుమార్) పట్టుబడ్డారు. ఆయన స్టేషన్ బెయిల్ మీద బయట తిరుగుతున్నారు. ఇందులో మా ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది" అని స్పష్టం చేశారు.మరోవైపు "తెలంగాణను మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చడమే మా ప్రభుత్వ లక్ష్యం. డ్రగ్స్ విషయంలో ఎంతటి వారైనా సరే, ఉక్కుపాదంతో అణిచివేస్తాం. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు" అని ముఖ్యమంత్రి తీవ్రంగా హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలోని లోపాలను సరిదిద్డడంతో పాటు, వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Follow Us