/rtv/media/media_files/2025/06/01/d5QMmyGCFtrObJszCtPt.jpg)
chicken price hike
Chicken Rate : ఒకవైపు పెరుగుతున్న ఎండలు, దిగుమంతి తగ్గడంతో హైదరాబాద్లో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. శనివారం నాడు కిలో చికెన్ (స్కిన్లెస్) ధర రూ.325కి చేరడం గమనార్హం. ఇక, నాటు కోడి అయితే కిలోకు రూ. 750-రూ.800 మధ్య పలుకుతుంది. దీంతో జనం మాంసం వైపు చూడాలంటేనే జంకుతున్నారు. ఒకవైపు ఇరాన్ యుద్ధంతో గ్యాస్ ధరలు పెరగడం, నిత్యావసరాల ధరలు, కూరగాయల ధరలు పెరగగా తాజాగా చికెన్ ధరకు రెక్కలు రావడంతో ఏం కొనెటట్లు లేదు..ఏం తినేటట్లు లేదంటూ వాపోతున్నారు.
ఒకవైపు ఎండలు ముదురుతుండటంతో పలు చోట్ల కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో దిగుమతి ఘననీయంగా పడిపోయింది. దిగుమతి లేకపోవడంతో గడచిన 4రోజులుగా చికెన్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఎండ వేడికి పలు కోళ్ల ఫారాల్లో కోళ్లు చనిపోతుండటం వల్లే అసవరమైన మేరకు కోళ్ల దిగుమతి లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. గతంతో పోలిస్తే చికెన్ ధర రూ.325కి పెరగడం ఇదే మొదటిసారని వినియోగదారులు వాపోతున్నారు. గతంలో ఎప్పుడూ ఇంత ధర లేదన్న అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్నారు.
కాగా, గ్రేటర్ హైదరాబాద్లో ప్రతి రోజూ సుమారు 10 నుంచి 15 వేల టన్నుల చికెన్ను విక్రయిస్తుంటారు. ఇక దసరా, సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ తదితర పండుగల సమయంలో రోజుకు 15--20 వేల టన్నుల వరకు చికెన్ అమ్మకం అవుతుంది. ఇక మటన్ దీనికి అదనమనే చెప్పాలి. హైదరాబాద్, శంషాబాద్, షాద్నగర్, మహబూబ్నగర్ తదితర ప్రాంతాల్లోని పౌల్ట్రీ ఫారాల నుంచి పెద్ద ఎత్తున నగరంలోని హోల్సేల్ చికెన్ మార్కెట్లతో పాటు చిన్నపెద్దా చికెన్ షాపులకు కోళ్లను సరఫరా చేస్తుంటారు. అయితే గత కొంతకాలంగా ఏపీలో కోళ్లు మృత్యువాత పడుతుండటంతో అక్కడి వ్యాపారులు కొందరు కోళ్లను మన దగ్గర నుంచి పెద్ద ఎత్తున కొనుక్కొని వెళ్తుండటంతో హైదరాబాద్లో కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎండల వల్ల కోళ్లు చనిపోవడం కూడా ధరలు పెరగడానికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. అంతేకాక కొన్ని చోట్ల వైరస్ వ్యాప్తి చెంది కోళ్లు పెద్ద ఎత్తున చనిపోతున్నట్లు తెలుస్తోంది. దీంతో చికెన్ తినాలంటేనే జనం జడచుకుంటున్నారు.
ఇక ప్రస్తుతం చేపల సీజన్ నడుస్తుండంతో చికెన్ తినడం మానేసి చాలామంది చేపలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. చేపల దిగుమతి కూడా ఘననీయంగా పెరగడంతో ఎక్కడ చూసినా చేపల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో నాన్ వెజ్ ప్రియులు చేపలవైపు మొగ్గు చూపుతున్నారు. చికెన్తో పోలిస్తే చేపల ధర కిలోకు కేవలం రూ.150 నుంచి రూ.300 వరకు మాత్రమే ఉండటంతో చేపల కొనుగోలుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. దీంతో చికెన్ అమ్మకాలు ఘననీయంగా పడిపోయాయి.
Follow Us