World War II bomb: ఇండియాలో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు.. రంగంలోకి ఆర్మీ..?

జార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భూమ్ జిల్లాలో ఒక అరుదైన, ప్రమాదకరమైన సంఘటన వెలుగుచూసింది. బహరాగోడా ప్రాంతంలోని సువర్ణరేఖ నదీ తీరంలో ఇసుక తవ్వకాలు జరుపుతుండగా, ఒక భారీ పేలని బాంబు బయటపడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

New Update
bomb

జార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భూమ్ జిల్లాలో ఒక అరుదైన, ప్రమాదకరమైన సంఘటన వెలుగుచూసింది. బహరాగోడా ప్రాంతంలోని సువర్ణరేఖ నదీ తీరంలో ఇసుక తవ్వకాలు జరుపుతుండగా, ఒక భారీ పేలని బాంబు బయటపడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇది రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి బాంబు అయి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఇసుక తవ్వకాల్లో బయటపడ్డ 'మృత్యువు'

నదీ తీరంలో కూలీలు ఇసుక తీస్తుండగా గ్యాస్ సిలిండర్ ఆకారంలో ఉన్న ఒక భారీ లోహపు వస్తువు కనిపించింది. నిశితంగా పరిశీలించగా అది శక్తివంతమైన బాంబు అని తేలడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ బాంబు ఇంకా 'యాక్టివ్' (క్రియాశీలకంగా) ఉండే అవకాశం ఉందని, ఎవరూ దాని దరిదాపుల్లోకి వెళ్లవద్దని గ్రామస్థులను హెచ్చరించారు.

అమెరికా తయారీ బాంబుగా గుర్తింపు?

బాంబుపై ఉన్న కొన్ని ముద్రలు, గుర్తుల ఆధారంగా ఇది అమెరికా సైన్యం తయారు చేసిన బాంబు అయి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దశాబ్దాల కాలం గడిచినా ఇది పేలకుండా అలాగే ఉండటం గమనార్హం. రాంచీకి చెందిన 'బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్' (BDDS) ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక తనిఖీలు చేపట్టింది. ఈ బాంబు చాలా బరువుగా, ప్రమాదకరంగా ఉందని వారు గుర్తించారు.

రంగంలోకి ఇండియన్ ఆర్మీ!
సాధారణంగా రాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన బాంబు స్క్వాడ్‌కు ఐఈడీలు (IEDs) లేదా చిన్న తరహా పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేయడంలో మాత్రమే అవగాహన ఉంటుంది. కానీ, ఇంత భారీ స్థాయి యుద్ధ కాలం నాటి బాంబును నిర్వీర్యం చేసే సాంకేతికత, నైపుణ్యం రాష్ట్ర స్థాయి బృందాల వద్ద లేదు. "మా స్క్వాడ్ దీనిని పరిశీలించింది. సాధారణ పద్ధతుల్లో దీనిని నిర్వీర్యం చేయడం అసాధ్యం. ఇది అత్యంత శక్తివంతమైనది కావడంతో భారత సైన్యం సాయం కోరుతూ ఉన్నతాధికారులకు లేఖ రాశాం" అని స్థానిక పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

ప్రస్తుతం ఆ ప్రాంతంలో పహారా కొనసాగుతోంది. సైన్యానికి చెందిన స్పెషల్ బాంబు డిస్పోజల్ యూనిట్ రాక కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. యుద్ధ మేఘాలు కమ్మిన కాలంలో భూమిలో కూరుకుపోయిన ఈ బాంబు, ఇప్పుడు బయటపడటంతో ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

Advertisment
తాజా కథనాలు