Israel Strikes Iran Nuclear And Steel Sites : అణు కేంద్రాలు, ఉక్కు కర్మాగారాలపై ఇజ్రాయెల్ దాడి..మూల్యం తప్పదన్న ఇరాన్‌

పశ్చిమాసియాలో యుద్ధం అంతకంతకూ ముదురుతోంది. రోజురోజుకు యుద్ధ మేఘాలు మరింతగా ముసురుతున్నాయి. అదే సమయంలో ఇజ్రాయెల్‌ తాజాగా జరిపిన దాడిలో ఇరాన్‌లోని అణు కేంద్రాలు, ఉక్కు కర్మాగారాలు దెబ్బతిన్నాయి. ఈ దాడితో రెండు దేశాల మధ్య మరింత ఉద్రిక్తత మరింత పెరిగింది.

New Update
Iran War

Iran War

Israel Strikes Iran Nuclear And Steel Sites : పశ్చిమాసియాలో యుద్ధం అంతకంతకూ ముదురుతోంది. రోజురోజుకు యుద్ధ మేఘాలు మరింతగా ముసురుతున్నాయి. అదే సమయంలో ఇజ్రాయెల్‌ తాజాగా జరిపిన దాడిలో ఇరాన్‌లోని అణు కేంద్రాలు, ఉక్కు కర్మాగారాలు దెబ్బతిన్నాయి. ఈ దాడితో రెండు దేశాల మధ్య మరింత ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ దాడులపై ఇరాన్‌ మండిపడింది. మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించింది. ఈ సందర్భంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు. దౌత్యం కోసం అమెరికా అధ్యక్షుడు పొడిగించిన దాడుల విరమణ గడువుకు ఇజ్రాయెల్‌ తూట్లు పొడించిందని, దౌత్యానికి ఈ చర్య పూర్తి విరుద్ధంగా ఉందని అబ్బాస్ మండిపడ్డారు. ఇజ్రాయెల్ చేస్తున్న ఈ 'నేరాలకు' తగిన రీతిలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.


  ఇరాన్‌ పై డాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్‌ ఈసారి ఇరాన్ ఆర్థిక, వ్యూహాత్మక వనరులను దెబ్బతీయడమే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ముఖ్యంగా ఇరాన్‌లోని పౌర అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్‌ దాడులు చేయడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా యజ్ద్ (Yazd) లోని యురేనియం వెలికితీత ప్లాంట్, అరాక్ (Arak) లోని హెవీ వాటర్ రియాక్టర్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయడం పై ఇరాన్‌ ఫైర్‌ అయింది. వీటితో పాటు ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న రెండు అతిపెద్ద ఉక్కు కర్మాగారాలను (Isfahan, Khuzestan ప్రావిన్సుల్లోనివి) ఇజ్రాయెల్ ధ్వంసం చేయడాన్ని   అరాగ్చి సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా ఖండించారు. ఈ దాడుల మూలంగా  ఇరాన్ ఉక్కు రంగానికి బిలియన్ల కొద్దీ నష్టం వాటిల్లినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక పవర్ ప్లాంట్‌తో పాటు ఇతర కీలక భవనాలు కూడా ఈ దాడుల్లో దెబ్బతినడంతో ఇరాన్ పెద్ద మొత్తంలో నష్టపోయింది.

అయితే ఈ దాడులపై ఇరాన్‌ మండిపడుతూ ఈ దాడులు కేవలం ఇజ్రాయెల్ ఒంటరిగా చేసినవి కావని, అమెరికా సమన్వయంతోనే జరిగాయని ఆరోపించింది. అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘిస్తూ ఇజ్రాయెల్ ఇటువంటి దాడులకు పాల్పడుతోందని, దీనివల్ల ప్రాంతీయ భద్రత పూర్తిగా దెబ్బతింటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా ఈ దాడులపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) కూడా మండిపడింది. ఇజ్రాయెల్‌ కు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది. 'ఇరాన్ మౌలిక సదుపాయాలను దెబ్బతీసినందుకు ప్రతీకారంగా.. అమెరికా, ఇజ్రాయెల్ అనుబంధ సంస్థలపై దాడులు చేస్తాం, అక్కడ పనిచేసే సిబ్బంది వెంటనే ఖాళీ చేయాలి' అని IRGC హెచ్చరించడం మరింత ఉద్రిక్తతలకు దారి తీసింది.

ఈ హెచ్చరికల నేపథ్యంలో, ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ స్పందించారు. ఇరాన్ తమ పౌరులపై దాడులకు సహకరించినంత కాలం ఇటువంటి దాడులు కొనసాగుతాయన్నారు. ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్‌ ఇచ్చారు. అయితే రెండు దేశాల మద్య సాగుతున్న యుద్ధం కారణంగా ప్రస్తుతం ఈ దాడుల వల్ల ఎటువంటి రేడియేషన్ ముప్పు లేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) ప్రాథమికంగా ధృవీకరించినప్పటికీ, యుద్ధం మరింత ముదిరితే మాత్రం  ప్రమాదం తప్పదని తెలిపింది. భవిష్యత్తులో ఈ దాడులు అణు దాడులకు దారితీసే అవకాశాలను కొట్టిపారేయలేమని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు