ఖార్గ్ ద్వీపం చుట్టూ ఇరాన్ సీ ‘మైన్’ వ్యూహం.. అమెరికా అడుగు వేస్తుందా?

పర్షియన్ గల్ఫ్‌లో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ ఆర్థిక వెన్నెముకగా భావించే ఖార్గ్ ఐలాండ్ ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇరాన్ ఆర్థిక మూలాలకు పట్టుకొమ్మ వంటి ఈ ద్వీపాన్ని కాపాడుకోవడానికి ఆ దేశం సర్వశక్తులా ప్రయత్నిస్తోంది.

New Update
Kharg Island

పర్షియన్ గల్ఫ్‌లో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ ఆర్థిక వెన్నెముకగా భావించే ఖార్గ్ ఐల్యాండ్ ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇరాన్ ఆర్థిక మూలాలకు పట్టుకొమ్మ వంటి ఈ ద్వీపాన్ని కాపాడుకోవడానికి ఆ దేశం సర్వశక్తులా ప్రయత్నిస్తోంది. అమెరికా మాత్రం దానిని హస్తగతం  చేసుకునే దిశగా పావులు కదుపుతోంది.

ఖార్గ్ ద్వీపం కేవలం ఒక భూభాగం కాదు, అది ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. ఇరాన్ చేసే మొత్తం ముడి చమురు ఎగుమతుల్లో దాదాపు 90 శాతం ఇక్కడి నుంచే జరుగుతాయి. ఒకవేళ ఈ ద్వీపం శత్రువుల వశమైతే లేదా ధ్వంసమైతే, ఇరాన్ ఆర్థికంగా కుప్పకూలడం ఖాయం. అందుకే దీనిని రక్షించుకోవడానికి ఇరాన్ తన సైనిక బలాన్నంతా అక్కడ మోహరిస్తోంది. గత కొన్ని వారాలుగా ఇరాన్ ఇక్కడ అసాధారణమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.

మందుపాతరల మోహరింపు: సముద్ర తీరం వెంబడి సైనికులను, యుద్ధ ట్యాంకులను అడ్డుకోవడానికి భారీగా మందుపాతరలను అమర్చింది. అమెరికా సైనికులు సముద్రం ద్వారా ద్వీపంలోకి ప్రవేశించే మార్గాలను ఇరాన్ మృత్యుకుహరాలుగా మార్చేసింది.

గగనతల రక్షణ: వైమానిక దాడులను తిప్పికొట్టడానికి అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌తో పాటు, హెలికాప్టర్లను కూల్చివేయగల 'మ్యాన్‌ప్యాడ్స్' క్షిపణులను సైనికులకు అందించింది.

ట్రంప్ ప్లాన్

అమెరికాలోని ట్రంప్ యంత్రాంగం ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం ద్వారా ఇరాన్‌ను లొంగదీసుకోవచ్చని భావిస్తోంది. తద్వారా ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన 'హోర్ముజ్ జలసంధి' పై పట్టు సాధించాలని వారి ప్రణాళిక. అయితే, ఇది ఆత్మహత్యాసదృశ్యమని సైనిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారీ సంఖ్యలో అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని, కేవలం ఈ ద్వీపాన్ని గెలవడం వల్ల మొత్తం సమస్య పరిష్కారం కాదని ట్రంప్ సన్నిహితులే కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో చమురు కేంద్రాలు దెబ్బతినడంతో ఇరాన్ మరింత అప్రమత్తమైంది. సెంట్కామ్ ఈ పరిణామాలపై మౌనం వహిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చనే భయం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. చమురు ధరలు మండిపోయే ప్రమాదం ఉన్నందున, ఈ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.

Advertisment
తాజా కథనాలు