/rtv/media/media_files/2026/03/01/crude-oil-prices-spike-amid-us-iran-war-2026-03-01-16-21-20.jpg)
Crude oil prices spike amid US-Iran war
Gas and oil problems : ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా గ్యాస్, చమురు సరఫరాలకు తీవ్ర విఘాతం కలుగుతుంది. ఇప్పట్లో యుద్ధం ముగిసే ఆనవాళ్లు కనిపించడం లేదు. అయితే పశ్చిమాసియాలో ఒకవేళ యుద్ధం ముగిసినా మరో ఆరునెలల వరకు గ్యాస్, చమురు సరఫరాకు ఇబ్బందులు తప్పవని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) చీఫ్ ఫతీ బిరోల్ స్పష్టం చేశారు. వాటి సరఫరాలను పూర్వస్థితికి చేరుకోవాలంటే కొన్ని నెలలు ఆగాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.
యుద్ధం మూలంగా చమురు, గ్యాస్ వ్యవస్థలకు తీవ్ర స్థాయిలో నష్టం జరిగిందని ఈ విషయాన్ని రాజకీయవర్గాలు, మార్కెట్లు సరిగా గుర్తించడం లేదని ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని గుర్తించి ప్రజలు పెట్రోలియం ఉత్పత్తులను పొదుపుగా వాడుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. ఇపుడున్న పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఏప్రిల్ చివరికల్లా చమురు ధరలు బ్యారెల్కు 180 డాలర్లు దాటిపోతాయని సౌదీ అరేబియా అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి సంస్థ అయిన సౌదీ ఆరామ్కో ఏప్రిల్ 2న తమ చమురు విక్రయ ధరను సవరించుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా శుక్రవారం చమురు ధర బ్యారెల్కు ఏకంగా119 డాలర్లను తాకింది. గల్ఫ్లోని చమురు రిఫైనరీలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే ఈ ధర మరింతగా పెరుగుతుందని మార్కెట్ వర్గాలు హెచ్చరించాయి. ఇప్పటికే ఫ్యూచర్స్ మార్కెట్లో ఏప్రిల్ తొలివారం నాటికే చమురు ధరలు 150 డాలర్ల వరకు చేరాయని వాల్స్ట్రీట్ జర్నల్ పేర్రొనడం గమనార్హం.
ప్రస్తుత పరిస్థితుల్లో చమురు ధరలు చుక్కలను తాకుతున్న నేపథ్యంలో.. ఇప్పటికే ఉత్పత్తై, నౌకల్లో నింపి ఉన్న ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తివేసేందుకు అమెరికా యోచిస్తున్నట్టు ఆ దేశ ఆర్థిక మంత్రి బసెంట్ స్పష్టం చేశారు. ఈ లెక్కన 140 మిలియన్ బ్యారెళ్ల చమురు సిద్ధంగా ఉందన్నారు. ఇదిలా ఉండగానే గల్ఫ్ ప్రాంతంలోని మూడు కీలక రిఫైనరీల్లో ఒకటైన కువైట్లోని మినా అల్ అహ్మదీ చమురు రిఫైనరీపై గతంలో దాడులు చేసిన ఇరాన్ మళ్లీ దాడులు చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే కాక సౌదీలోని రియాద్లో క్షిపణుల దాడితో ఆ శకలాలు పడి మరొక భారతీయుడు మృతిచెందడం కలకలం సృష్టించింది. దీనితో పశ్చిమాసియా ఘర్షణల్లో ఇప్పటివరకు చనిపోయిన భారతీయుల సంఖ్య ఆరుకు చేరడం గమనార్హం. జనవరిలో ఇరాన్లో ఆందోళనలు జరిగాయి. ఈ ఆందోళనల్లో ఇద్దరు పోలీసు అధికారులను చంపిన ఆరోపణలపై.. ఆ దేశ రెజ్లింగ్ క్రీడాకారుడు సలే మొహమ్మదితోపాటు మరో ఇద్దరిని బహిరంగంగా ఉరితీయడం గమనార్హం.
Follow Us