/rtv/media/media_files/2026/03/17/trisha-2026-03-17-09-02-28.jpg)
తమిళ స్టార్ హీరో విజయ్, త్రిషల వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలపై నటి ఖుష్బూ సుందర్ ఘాటుగా స్పందించారు. ఇటీవల చెన్నైలో జరిగిన ఒక వివాహ రిసెప్షన్లో విజయ్, త్రిషలు కలిసి కనిపించడం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ముఖ్యంగా విజయ్ భార్య సంగీత సోర్ణలింగం విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారనే వార్తలు వచ్చిన కొద్ది రోజులకే ఈ జంట బహిరంగంగా కనిపించడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఖుష్బూ.. త్రిషను వెనకేసుకొచ్చారు. "మనం ఎలాంటి కాలంలో ఉన్నామంటే.. ఎవరైనా తుమ్మినా దానికి వేరొకరిని నిందించే పరిస్థితి ఉంది. త్రిష నాకు చాలా కాలంగా తెలుసు, ఆమె నాకు అత్యంత సన్నిహితురాలు. నేను కలిసిన మహిళల్లో ఆమె అత్యంత హుందాతనం కలిగిన వ్యక్తి, ఎంతో సున్నితమైన మనస్తత్వం కలది" అని కొనియాడారు.
ఎవరి వ్యక్తిగత జీవితం వారి ఇష్టం
ప్రజా ప్రతినిధులు లేదా సినీ తారల వ్యక్తిగత జీవితాలపై అనవసరమైన ఆసక్తి చూపడం సరైనది కాదని ఖుష్బూ అభిప్రాయపడ్డారు. "వేరొకరి జీవితాల్లోకి తొంగి చూస్తూ ఆనందం పొందే వారే ఇలాంటి కామెంట్స్ చేస్తుంటారు. ఎవరి వ్యక్తిగత జీవితం వారి ఇష్టం. వారి పర్సనల్ లైఫ్ సమాజంపై ప్రభావం చూపనంత వరకు దాన్ని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు" అని స్పష్టం చేశారు.
ఇటీవల చెన్నై విమానాశ్రయంలో త్రిషను కెమెరాలతో వెంబడించడంపై కూడా ఖుష్బూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ముంబైలో ఉండే ఈ పాపరాజీ సంస్కృతి ఇప్పుడు చెన్నైకి కూడా పాకడం దురదృష్టకరమని ఆమె అన్నారు. విమానాశ్రయంలో మీడియా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా త్రిష హుందాగా అక్కడి నుండి వెళ్లిపోయిన తీరును ఆమె సమర్థించారు.
Follow Us