/rtv/media/media_files/2026/03/17/cinema-2026-03-17-07-01-04.jpg)
సినిమా ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న పైరసీ భూతాన్ని వదిలించేందుకు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TSCSB) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎవరైనా థియేటర్లలో సినిమాలను రికార్డ్ చేసినా లేదా పైరసీకి పాల్పడినా కఠిన చర్యలు తప్పవని అధికారులు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు కొత్తగా రూపొందించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను సి.ఎస్.బి డైరెక్టర్ శిఖాగోయల్ విడుదల చేశారు.
దీని ప్రకారం, పైరసీకి పాల్పడే వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష పడవచ్చు. జైలుతో పాటు రూ. 3 లక్షల జరిమానా లేదా సినిమా నిర్మాణ ఖర్చులో 5 శాతం వరకు పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. పైరసీని అరికట్టడానికి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్తో కలిసి జనవరిలోనే యాంటీ పైరసీ యూనిట్ను ఏర్పాటు చేశారు. థియేటర్లలో సినిమా మొదలయ్యే ముందు దీనిపై అవగాహన కల్పించే డిస్క్లైమర్లను కూడా ప్రదర్శించనున్నారు. హాల్లో కూర్చుని కెమెరాతో రికార్డ్ చేయడం (క్యామ్కార్డింగ్) చట్టరీత్యా నేరమని ప్రేక్షకులకు క్లియర్గా అర్థమయ్యేలా వివరిస్తారు.
సురేష్ బాబు మాట్లాడుతూ
ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దగ్గుబాటి సురేష్ బాబు మాట్లాడుతూ.. పైరసీ వల్ల కేవలం నిర్మాతలే కాకుండా పంపిణీదారులు, థియేటర్ యాజమాన్యాలు కూడా తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా పరిశ్రమ బతకాలంటే అందరూ కలిసికట్టుగా ఈ పైరసీపై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. సో, తస్మాత్ జాగ్రత్త.. పైరసీ జోలికెళ్తే ఊచలు లెక్కపెట్టక తప్పదు. ఐబొమ్మ లాంటి సైట్లపై ఆధారపడే వారికి కూడా ఇది ఒక గట్టి హెచ్చరిక అని చెప్పవచ్చు.
Follow Us