BREAKING: కుప్పకూలిన ఆర్మీ విమానం.. 80 మంది సైనికులు మృతి!

దేశ సరిహద్దుల్లో గస్తీకి వెళ్తున్న కొలంబియా మిలిటరీ విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే క్రాష్ అయ్యింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న సుమారు 80 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయి ఉంటారని రక్షణ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

New Update
_military plane crashes

టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాలకే అమెజాన్ అడవుల్లో సైనిక విమానం కుప్పకూలిపోయింది. ఈ పెను విషాదం కొలంబియా దేశంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. దేశ సరిహద్దుల్లో గస్తీకి వెళ్తున్న కొలంబియా మిలిటరీ విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే క్రాష్ అయ్యింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న సుమారు 80 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయి ఉంటారని రక్షణ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనతో కొలంబియా వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

అమెజాన్ అటవీ ప్రాంతంలోని పుటుమాయో ప్రావిన్స్‌లో ఉన్న పోర్టో లెగుయిజామో సైనిక స్థావరం నుండి 'హెర్క్యులస్ సి-130' విమానం టేకాఫ్ అయ్యింది. పెరూ సరిహద్దుల్లో మోహరించిన బలగాలకు సహాయంగా ఈ విమానంలో మొత్తం 120 మందికి పైగా సిబ్బంది ప్రయాణిస్తున్నారు. అయితే, రన్‌వే టేకాఫ్ అయిన 3 కిలోమీటర్ల దూరంలోనే విమానంలో టెక్నికల్ ప్రాబ్లమ్ తలెత్తింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో విమానం అడవిలో కుప్పకూలిపోయింది.

ప్రమాదం జరిగిన వెంటనే విమానం భారీ శబ్దంతో పేలిపోయింది. దట్టమైన పొగలు, మంటల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. విమానంలో 110 మంది సైనికులు, 11 మంది సిబ్బంది ఉన్నారు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం, కనీసం 80 మంది మరణించి ఉండవచ్చు అని అధికారులు భయపడుతున్నారు. దాదాపు 30 నుండి 40 మందిని తీవ్ర గాయాలతో స్థానిక ఆసుపత్రులకు తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.

అధ్యక్షుడి దిగ్భ్రాంతి

ఈ ఘటనపై కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సైనిక విమానాల ఆధునీకరణలో జరుగుతున్న జాప్యం వల్లే ఇటువంటి అనర్థాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "ఇది దేశానికి అత్యంత బాధాకరమైన రోజు. ప్రాణాలు కోల్పోయిన వీర సైనికుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని ఆయన ఎక్స్ (X) వేదికగా పేర్కొన్నారు.

దర్యాప్తు ప్రారంభం

ప్రమాదానికి గల కారణాలపై ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల జరిగిందా లేక ఇంజిన్ వైఫల్యమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ ప్రాంతంలో తిరుగుబాటు దారుల దాడులు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి, కానీ ప్రాథమికంగా ఇది సాంకేతిక లోపమేనని రక్షణ మంత్రి పెడ్రో సాంచెజ్ తెలిపారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో మృతదేహాలను వెలికితీయడం, క్షతగాత్రులను తరలించడం సైన్యానికి సవాలుగా మారింది. 

Advertisment
తాజా కథనాలు